ఏం చేశారని ఓట్ల కోసం వచ్చారు?

8 Apr, 2019 05:11 IST|Sakshi
ఆదివారం రాత్రి రాప్తాడులో పరిటాల సునీత, శ్రీరాంను అడ్డుకున్న గ్రామస్తులు

భూములు లాక్కున్నారు.. మరుగుదొడ్ల బిల్లులు తిన్నారు

పరిటాల సునీత, శ్రీరాంను అడ్డుకున్న రాప్తాడు ప్రజలు

అనంతపురం : ‘ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ఓట్లు అడగడానికి వచ్చారు. మా ఇళ్లను కూల్చేశారు. భూములను లాక్కున్నారు. మరుగుదొడ్ల బిల్లులను తినేశారు. అష్టకష్టాలు పడుతున్న మమ్మల్ని ఏనాడూ పలకరించిన పాపాన పోలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చామా?’.. అంటూ మంత్రి పరిటాల సునీత, టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాంను రాప్తాడు వాసులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరాం, ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప ఆదివారం రాత్రి 9 గంటలకు అనంతపురం జిల్లా రాప్తాడుకు చేరుకున్నారు.

సునీత మాట్లాడే సమయంలో స్థానిక మహిళలు పెద్దఎత్తున చుట్టుముట్టి  ఇళ్లను కూల్చేశారంటూ మండిపడ్డారు. మరుగుదొడ్ల బిల్లుల మంజూరులో అవినీతిపై, జాకీ ఫ్యాక్టరీ కోసమంటూ నిరుపేదలకు చెందిన 50 ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై నిలదీశారు. ఇలాంటి అవినీతిపరులకు తామెలా ఓటు వేస్తామనుకుని వచ్చారంటూ ప్రశ్నించారు. రాత్రి 11 వరకూ మంత్రి, ఆమె తనయుడు రాప్తాడులో మైకులు పెట్టి మరీ ప్రచారం నిర్వహించారు. 

మరిన్ని వార్తలు