శివాజీ పార్క్‌లో ర్యాలీ: రాహుల్‌కు చుక్కెదురు

28 Feb, 2019 11:12 IST|Sakshi

ముంబై: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మార్చి 1వ తేదీన దాదార్‌లోని శివాజీ పార్క్‌లో తలపెట్టిన ఎన్నికల ర్యాలీకి చుక్కెదురైంది. శివాజీ పార్కులో ర్యాలీ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం నుంచి అనుమతి లభించలేదు. దీంతో అదే తేదీన బీకేసీలోని ఎంఎంఆర్డీఏ మైదానంలో రాహుల్‌ ర్యాలీ నిర్వహించబోతున్నామని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అశోక్‌ చవాన్‌ ప్రకటించారు.

చారిత్రక శివాజీ పార్కులో రాహుల్‌ గాంధీ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణసేన, బీజేపీలు శివాజీ పార్కులో భారీ ర్యాలీలు నిర్వహించాయని, అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చి తమ పార్టీకి మాత్రం అవకాశం ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వివక్షలో భాగమేనని చవాన్‌ ఆరోపించారు.  మార్చి నెలలో రాహుల్‌ మహారాష్ట్రలో పర్యటించబోతున్నారు. మార్చి 1న ముంబై, ధూలే ప్రాంతాల్లో రాహుల్‌ ర్యాలీలు నిర్వహిస్తారు. రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని రాహుల్‌ మహారాష్ట్ర నుంచి ప్రారంభిస్తారని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు