అందుబాటులో కరోనా వైద్య పరికరాలు
మంత్రి పేర్ని నాని
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో కృషి చేస్తోందని, ఈ విషయంలో ప్రజలు ధైర్యంగా ఉండాలని సమాచార, ప్రజా రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. విజయవాడ ఆర్ అండ్ బీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రంలో ఉంటూ.. ఇక్కడేం జరుగుతోందో తెలుసుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు వైద్య పరికరాలు అందుబాటులో లేవంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా మాట్లాడటం తగదన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
► పరీక్షలు నిర్వహించే విషయంలో మనం ఎక్కడా వెనుకబడ లేదు. త్వరలోనే రోజుకు 3 వేల మందికి పరీక్షలు చేసే స్థితికి చేరుకుంటాం.
► ఆస్పత్రిలో పరికరాలు లేవంటూ నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యుడు రాజకీయ నాయకుడిలా మాట్లాడటం మంచిది కాదు.
► ఆ వీడియో ఆధారంగా ఆస్పత్రికి వెళ్లి పరిశీలించగా.. ఏప్రిల్ 3వ తేదీ నాటికే పీపీఈలు 20, ఎన్–95 మాస్కులు 32, హెచ్ఐవీ మాస్కులు 35 అందుబాటులో ఉన్నట్లు గుర్తించాం.
► ఆ వైద్యశాల కరోనా ఆస్పత్రి కాకపోయినా ముందు జాగ్రత్త చర్యగా పరికరాలను అక్కడ అందుబాటులో ఉంచాం.
► డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఎన్–95 మాస్కులు, పీపీఈలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి.