పండితపుత్రా.. వాస్తవాలు తెలుసుకో!

4 Aug, 2019 04:25 IST|Sakshi

బందర్‌ పోర్టు తెలంగాణకు అంటూ అసత్యప్రచారాలు 

లోకేశ్‌పై మంత్రి పేర్ని నాని ధ్వజం

విజయవాడ సిటీ: పండిత పుత్రః.. అన్న చందంగా వ్యవహరిస్తున్న లోకేశ్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) హితవు పలికారు. బందర్‌ పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రహస్య జీవోలంటూ.. వాటిని డౌన్‌లోడ్‌ చేయడం కూడా రాని లోకేశ్‌ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పబ్లిసిటీ కోసం బాబు బందరు పోర్టుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనం ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మాత్రం మార్పు రావడంలేదన్నారు. 

కేసుల భయంతో పారిపోయి రాలేదా?
పదేళ్ల పాటు రాష్ట్రానికి ఉన్న హక్కుల్ని కేసీఆర్‌కు అమ్మేసి కేసుల భయంతో తండ్రీకొడుకులు హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చిన విషయం నిజం కాదా.. అని ప్రశ్నించారు. ‘2018 కల్లా పోలవరం పూర్తి చేస్తాం.. రాసి పెట్టుకోండి’.. అంటూ సవాల్‌ చేసి.. పూర్తిచేయకపోగా, కమీషన్ల పేరుతో భారీగా దండుకున్నారని ఆరోపించారు. మచిలీపట్నాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని, ఆయన వేసిన శంకుస్థాపన రాయి తప్ప అక్కడేం లేదన్నారు. బందరు పోర్టు పనులను నవయుగ కంపెనీ చేయకపోతే తామే చేపడతామని స్పష్టం చేశారు.

దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు. రాజకీయంగా బతికున్నానని చెప్పుకునేందుకే బందరు పోర్టుపై కొల్లు రవీంద్ర తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు, పొక్లెయిన్‌లు, జేసీబీ, బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌ మిషన్లతో పోర్టు కడతారా అని ఎద్దేవా చేశారు. పోర్టుకు పర్యావరణ అనుమతులు వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. ఇచ్చిన మాటల్ని నెరవేర్చే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. బందరు పోర్టు హామీని కూడా ఆయన నిలబెట్టుకుంటారని మంత్రి నాని స్పష్టం చేశారు. 

>
మరిన్ని వార్తలు