‘ఊసరవెల్లిలా రంగులు మార్చే పేటెంట్‌ కూడా బాబుదే’

18 Jan, 2019 15:14 IST|Sakshi

విజయవాడ: గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే దేశంలో ఇంత పచ్చి అవకాశవాది ఎవరూ ఉండరనే విషయం మనకు తెలుస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే పేటెంట్‌ కూడా చంద్రబాబుకే వచ్చిందని ఎద్దేవా చేశారు.  ‘ చంద్రబాబు మీరు ఏది చెప్తే అది చేయడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. హోదా వద్దు అనే కోదండరామ్‌తో చంద్రబాబు సావాసం చేస్తున్నారు. పాలార్‌ డ్యామ్‌ వద్దు అనే స్టాలిన్‌ ఇంటికి వెళ్లి చంద్రబాబు స్నేహం చేస్తారు. పోలవరానికి అడ్డు చెప్తున్న నవీన్‌ పట్నాయక్‌తో బాబు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. చంద్రబాబుకు నిలువెల్లా విషం’ అని నాని మండిపడ్డారు.

మరొకవైపు ఏపీ మంత్రి దేవినేని ఉమాపై కూడా నాని ధ్వజమెత్తారు. దోచుకున్న డబ్బుతో ఉమ నాలుక తిరగడం లేదని, ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిది మొదటి నుంచి ఒకే స్టాండ్‌ అని, ప్రత్యేక హోదా గురించి కేసీఆర్‌, కేటీఆర్‌తో చెప్పించిన ఘనత జగన్‌దేనన్నారు. చంద్రబాబులా జగన్‌ ఎప్పుడూ దివాలాకోరు రాజకీయాలు చేయరన్నారు.

>
మరిన్ని వార్తలు