జిగ్నేశ్‌ మేవాని కాంగ్రెస్‌ ఏజెంట్‌: పిడమర్తి రవి

19 Jan, 2018 01:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవాని కాంగ్రెస్‌ ఏజెంట్‌లా మాట్లాడుతున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి విమర్శించారు. తెలంగాణలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందన్న జిగ్నేష్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.

గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్‌లో జిగ్నేశ్‌ దళిత ఉద్యమాన్ని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణలో దళితులు చైతన్యశీలురని, ఇక్కడి దళిత సంఘాలకు మేవాని పాఠాలు అక్కర్లేదని అన్నారు.  మాయావతి వంటి గొప్ప దళిత నాయకురాలిని విమర్శిస్తున్న జిగ్నేశ్‌ మేవానికి దళితుల మద్దతు లేదని అన్నారు. మంద కృష్ణ అంబేడ్కర్‌ సిద్ధాంతాన్ని గాలికొదిలి భౌతిక దాడులను నమ్ముకున్నారని, ఆయన జైల్లో ఉన్నా, బయట ఉన్నా మాదిగ ఏబీసీడీ వర్గీకరణ పోరాటం ఆగదని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు