వర్మకు టిక్కెట్‌ ఇస్తే ఓడిస్తాం

2 Mar, 2019 07:58 IST|Sakshi
చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్న పిఠాపురం వర్మ వ్యతిరేక వర్గం టీడీపీ నేతలు

చంద్రబాబు వద్ద పిఠాపురం పంచాయతీ

బాబును కలిసి ఫిర్యాదు చేసిన వర్మ వ్యతిరేక వర్గం

తూర్పుగోదావరి, పిఠాపురం: గత ఎన్నికల్లో తనకు టీడీపీ సీటు ఇవ్వనందుకు పార్టీ జండాలను పట్టపగలు నడిరోడ్డుపై తగులబెట్టించిన  ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలుగుదేశం పార్టీ నేత ఎలా అవుతారంటూ ఆయన వ్యతిరేక వర్గం పోరాటాన్ని ఉద్ధృతం చేయడంతో పిఠాపురం టీడీపీలో ముసలం ముదిరి అధినేత వద్దకు చేరింది. శుక్రవారం పిఠాపురానికి చెందిన టీడీపీ నేతలు వర్మ వ్యతిరేక  వర్గం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసి వర్మపై ఫిర్యాదు చేయడంతోపాటు కాపు సామాజికవర్గం నేతకు సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వర్మకు వ్యతిరేకంగా సమావేశమైన టీడీపీ నేతలు  కాకినాడ ఎంపీ తోట నరసింహం వద్ద పంచాయితీ పెట్టిన అనంతరం ముఖ్యమంత్రిని కలిశారు. ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మకు సీటు ఇస్తే ఓడించి తీరుతామని టీడీపీ నేతలు అధిష్టానానికి హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిని కలిసినవారిలో తెలుగుదేశం పార్టీ నేతలు మున్సిపల్‌ చైర్మన్‌ కరణం చిన్నారావు, మాజీ జడ్పీటీసీ జవ్వాది కృష్ణమాధవరావు, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు తుమ్మల బాబులు, పడాల ఏసు, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు