సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించిన క్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు గురువారం సాయంత్రం 5.30 గంటలకు భేటీ కానుంది. ఓట్ల లెక్కింపులో విస్పష్ట మెజారిటీతో బీజేపీ తిరిగి అధికారంలోకి రానుందనే సంకేతాలతో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 330కి పైగా లోక్సభ స్ధానాల్లో గెలుపొందనుండగా, బీజేపీ సొంతంగా 292 స్ధానాల్లో విజయదుందుభి మోగించే దిశగా దూసుకువెళుతోంది.
ఇక 543 మంది సభ్యులు కలిగిన లోక్సభలో బీజేపీ మ్యాజిక్ మార్క్ 272 సీట్లకు 20 స్ధానాలు అదనంగా గెలుపొందే దిశగా సాగుతోంది. విపక్ష కాంగ్రెస్ కేవలం 51 స్ధానాల్లోనే ఆధిక్యం కనబరుస్తూ బీజేపీ కంటే చాలా దూరంలో నిలిచింది. మరోవైపు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాయ్బరేలీలో ఆధిక్యంలో ఉన్నారు.