సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి పదేపదే అడ్డుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులతోపాటు రేణుకా చౌదరి పదేపదే మోదీ ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఓ దశలో సభాపతిగా ఉన్న వెంకయ్యనాయుడు.. ప్రధాని ప్రసంగానికి అడ్డు తగలవద్దంటూ రేణుకను మందలించారు కూడా. అయితే, ఈ సమయంలో ప్రధాని మోదీ.. రేణుకా చౌదరిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రసంగిస్తుండగా రేణుక గట్టిగా నవ్వుతుండటంతో.. 'సభాపతిగారు.. రేణుకాజీని ఏమీ అనొద్దని మిమ్మల్ని కోరుతున్నా.. రామాయణం సీరియల్ తర్వాత ఇంతటి నవ్వులను వినే సౌభాగ్యం ఇప్పుడే దక్కింది' అంటూ మోదీ అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంలోని ఆసక్తికర వ్యాఖ్యలు..