ఆందోళన వద్దు సోదరా..

13 Dec, 2019 04:52 IST|Sakshi

 ‘ఈశాన్య’ ప్రజలనుద్దేశించి మోదీ

  జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం

ధన్‌బాద్‌: పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్‌) పార్లమెంటు ఆమోదించడాన్ని నిరసిస్తూ అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు అంతకంతకూ ఉధృతంగా మారడంతో ప్రధాన మంత్రి మోదీ వారిని శాంతింప జేసే ప్రయత్నాలు చేశారు. కొత్త చట్టంపై ఎలాంటి ఆందోళన వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ధన్‌బాద్‌ ఎన్నికల ర్యాలీలో గురువారం ప్రసంగించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈశాన్య రాష్ట్ర ప్రజలకున్న ప్రత్యేక గుర్తింపుని, సంస్కృతిని, భాషని కాపాడతా మని హామీ ఇచ్చారు.

క్యాబ్‌పై కాంగ్రెస్‌  దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈశాన్య ప్రాంతంలో అస్సాం సహా ప్రతీ రాష్ట్రంలో ఆదివాసీ సమాజ సంస్కృతీ సంప్రదాయాల్ని, వారి జీవన విధానాన్ని పరిరక్షిస్తామన్నారు.  అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ కిందకు వచ్చే ఆదివాసీ ప్రాంతాలను కొత్త చట్టం నుంచి మినహాయించినట్టు మోదీ చెప్పారు. అంతకు ముందు ప్రధాని ఇంగ్లీషు, అస్సామీ భాషల్లో వరస ట్వీట్లు చేస్తూ స్థానిక హక్కులు కాపాడే నిబంధన 6 స్ఫూర్తికి భంగం కలిగించబోమన్నారు.

మరిన్ని వార్తలు