సాక్షి, ముంబై : దేశ ప్రజల గురించి ఆలోచించడాన్ని కాంగ్రెస్ ఎప్పుడో మరిచిపోయిందని ఆ పార్టీ నుంచి ఇంకేమీ ఆశించలేమని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. తమను కాపాడే కాపలాదారు కావాలో..అవినీతి వారసుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలని కోరారు. తమ హయాంలో గత ఐదేళ్లలో భారత్ సూపర్ పవర్గా ఎదిగిన విషయం ప్రపంచం గుర్తించిందన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ షిర్డీ, అహ్మద్నగర్ లోక్సభ అభ్యర్ధుల విజయాన్ని ఆకాంక్షిస్తూ శుక్రవారం జరిగిన ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గత యూపీఏ హయాంలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడిచిందని ప్రస్తుతం దేశ ప్రజలు తమకు కాపలాదారు కావాలో..అవినీతి నేత కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు.
21వ శతాబ్ధంలో జన్మించిన యువత ఇప్పుడు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని దేశ భద్రత విషయంలో గత ప్రభుత్వాలు రాజీ పడటాన్ని మీరు అంగీకరిస్తారా అని వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జమ్ము కశ్మీర్కు ప్రధాన మంత్రి ఉండాలన్న కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్పై మోదీ మండిపడ్డారు. .