ప్రజల ప్రాణాలు పోతే..వేడుకలా..?

30 Oct, 2017 15:31 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: జీఎస్‌టీ, నోట్లరద్దు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. నోట్ల రద్దు అత్యంత ఘోరంగా విఫలమైందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ అంగీకరించడం లేదన్నారు. ‘నవంబర్‌ 8..భారత్‌కు విషాదకర దినం..బీజేపీ ఆ రోజున నల్లధన వ్యతిరేక దినంగా పాటించాలని పిలుపు ఇవ్వడం తనకు అర్థం కావడం లేద’ని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

ప్రధాని ప్రజల మనోగతాన్ని అర్ధం చేసుకోవాలని, దేశ ప్రజలను వందలాదిగా బలిగొన్న రోజున ఉత్సవాలు జరుపుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.నోట్ల రద్దుతో దేశంలోని నిరుపేదలు అనుభవించిన కష్టాలను అర్థం చేసుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని విమర్శించారు.

వాస్తవాలను ప్రధాని ఇప్పటికీ అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు ఘోరంగా విఫలమైందని రాహుల్‌ పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడి ఏడాదైన సందర్భంగా దేశవ్యాప్తంగా విపక్షాలతో కలిసి బ్లాక్‌ డే నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతకుముందు నిరసన కార్యక్రమాలపై పార్టీ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ పలు సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు