‘సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తీరు’

23 May, 2020 05:48 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ పరిస్థితులపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రధాని మోదీ సమాఖ్య స్ఫూర్తిని మరిచి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. 22 ప్రతిపక్షపార్టీలు పాల్గొన్న సమావేశంలో సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. వలసకార్మికుల పట్ల ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరించిందన్నారు. అట్టడుగున ఉన్న 13 కోట్లమంది కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక ఉపశమనం లభించలేదని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 12న ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ హాస్యాస్పదంగా మారిందన్నారు.  వలస కార్మికులను  స్వస్థలాలకు చేర్చేందుకు రైళ్లు, బస్సులు నడపడంతో పాటు పేదల ఖాతాల్లో డబ్బు జమచేయాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు