నెట్‌లో మోదీ, కాంగ్రెస్‌ టాప్‌

7 Apr, 2019 04:16 IST|Sakshi

ఇప్పటికే ట్విట్టర్‌ ఫాలోయింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో కూడా మొదటి స్థానం సంపాదించారు. ఇంటర్‌నెట్‌లో అత్యధికులు శోధించిన భారత రాజకీయ నేతగా మోదీ రికార్డు నెలకొల్పారు. తర్వాత స్థానంలో రాహుల్‌ గాంధీ నిలిచారు. ఎక్కువ మంది నెటిజన్లు శోధించిన రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్‌ ముందుంది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌ఈఎంరష్‌ అనే సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2018లో 72 లక్షల 40వేల మంది మోదీ కోసం శోధించారు.

2019లో 18 లక్షల 20 వేల మంది శోధించారు. 2019లో రాహుల్‌గాంధీ కోసం 15 లక్షల మంది ఇంటర్‌నెట్‌లో శోధించారని ఆ సంస్థ నివేదిక తెలిపింది. 2018 డిసెంబర్‌లో నెటిజన్లు ఎక్కువ సెర్చ్‌ చేసింది కాంగ్రెస్‌ పార్టీనేనని తేలింది. ఈ మధ్యనే కాంగ్రెస్‌ క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీకి కూడా నెట్‌ పాపులారిటీ బాగా పెరిగింది. 2019లో 12 లక్షల 20వేల మంది ప్రియాంక కోసం శోధించారు. 2018లో ఈ సంఖ్య 7 లక్షలు మాత్రమేనని అధ్యయన నివేదిక వెల్లడించింది.

నెటిజన్లలో అత్యధికులు ‘నరేంద్రమోదీ ఎవరు? అన్న పేరుతో ఆయన గురించి శోధించారని సంస్థ ప్రతినిధి ఫెర్నాండో తెలిపారు. ఇదిలా ఉండగా, ఫేస్‌బుక్‌లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ మొదటి స్థానంలో ఉన్నారని కూడా ఆయన చెప్పారు. 2019 ఫిబ్రవరి, మార్చి మధ్య మోదీ ప్రొఫైల్‌ 68.22 శాతం పెరిగింది. అధ్యయనం కోసం తాము ఎనిమిది మంది భారత రాజకీయవేత్తలను ఎంపిక చేసుకున్నామని, 2018 ఫిబ్రవరి నుంచి 2019 ఫిబ్రవరి వరకు వారిలో ఎవరిని ఎన్నిసార్లు నెటిజన్లు శోధించారో లెక్కించి నివేదిక తయారు చేశామని ఫెర్నాండో వివరించారు. 

మరిన్ని వార్తలు