‘నమో నినాదంతో దీదీకి నిద్ర కరవు’

7 Apr, 2019 12:51 IST|Sakshi

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికార పగ్గాలు చేపట్టేందుకు యూపీతో పాటు పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ ఆ దిశగా ప్రచార వ్యూహాలకు పదునుపెట్టింది. బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌లో ఆదివారం జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశానికి ఇద్దరు ప్రధానులు కావాలంటున్న నేతకు మమతా బెనర్జీ మద్దతు ఇస్తున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్ధుల్లాను ప్రస్తావిస్తూ దుయ్యబట్టారు.

వారు దేశానికి ఓ ప్రధాని, జమ్ము కశ్మీర్‌కు మరో ప్రధాని కావాలని కోరుతున్నారని, అలాంటి నేతలకు మద్దతు ఇస్తామా అని ప్రశ్నించారు. ప్రధాని పేరును బెంగాల్‌ ప్రజలు నినదిస్తుంటే దీదీకి నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఆమె అడ్డుగోడలా నిలుస్తున్నారని విమర్శించారు. పోలీస్‌ అధికారుల బదిలీలతో మమతా బెనర్జీ బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. శారదా, రోజ్‌వ్యాలీ స్కామ్‌లను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. నారద, శారద, రోజ్‌వ్యాలీ స్కామ్‌ల్లో బాధితులకు తాము న్యాయం​చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు