పోలవరాన్ని జాతీయ స్కాంగా మార్చారు

18 Jan, 2018 01:58 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పార్థసారథి

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం జాతీయ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి కుంభకోణంగా మార్చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితే ఒక నెల వ్యవధిలోనే చంద్రబాబు పదవీచ్యుతుడై జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, ఇష్టారాజ్యంగా పెంచేసిన నిర్మాణ అంచనా వ్యయం, కాంట్రాక్టు అక్రమాలపై వస్తోన్న విమర్శలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రే స్వయంగా సీబీఐ విచారణను కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ ప్రాజెక్టులో సాగుతున్న అవినీతి, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఇంతకాలంగా చెప్తోందని, రైతుల నుంచి తాజాగా అందిన ఫిర్యాదులపై ప్రధాని కార్యాలయం కూడా స్పందించిందని చెప్పారు. తాము ఆరోపించిన అక్రమాలపై కేంద్రం నేడు ప్రశ్నిస్తోందని తెలిపారు. ఈ విషయాలపై పోలవరం అథారిటీ మెంబరు సెక్రటరీ æడాక్టరు ఆర్‌కే గుప్త ఏపీ జలవనరుల శాఖ ఇంజనీరు–ఇన్‌–చీఫ్‌ను వివరణ అడిగారని... గుప్త రాసిన లేఖను మీడియా ముందుంచారు. 

పోలవరంపై సీబీఐ విచారణ జరగాలి : చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నుంచి అందినకాడికి దోచుకోవాలనే చూస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టును ఒక బంగారు బాతులాగా చూస్తున్నారని, జరగని పనిని జరిగినట్లు చూపించి కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసి తన వంతు వాటా నిధులను కొట్టేస్తున్నారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు