సాక్షి, న్యూఢిల్లీ : ‘మై లవ్ ఫర్ మై కంట్రీ ఈజ్ మై స్ట్రెంత్ (దేశంపై నాకున్న ప్రేమే నా బలం)’ అన్న ట్యాగ్ లైన్తో ప్రధాని నరేంద్ర మోదీపై తీసిన బయోపిక్ చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’ టైటిల్తో ఏప్రిల్ ఐదవ తేదీన విడుదలవుతున్న విషయం తెల్సిందే. నరేంద్ర మోదీతో రాజకీయంగా తలపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీసిన బయోపిక్ ‘మై నేమ్ ఈజ్ రాగా’ ఏప్రిల్లోనే విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు గానీ ఏ తేదీని ఖరారు చేయలేదు. ‘నిన్ను ద్వేషించే వారి దగ్గరికి నీవు వెళ్లి నన్ను కాస్త ప్రేమించండి! అంటూ నీవు చెప్పడం నాకెంతో నచ్చింది’ అని ఓ యువతి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లి చెప్పడం అందుకు బదులుగా రాహుల్ గాంధీ కొంటెగా నవ్వూతూ కన్ను గీటడం ‘మై నేమ్ ఈజ్ రాగా’ చిత్రం టీజర్లో కనిపించింది.
ఈ దశ్యం పార్లమెంట్లో రాహుల్గాంధీ తన ప్రసంగాన్ని ముగించి అనూహ్యంగా ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఆయన్ని హత్తు కోవడం, ఆ తర్వాత తన సీటులో కూర్చొని తోటి వారివైపు తిరిగి కన్నుగీటిన సంఘటనను గుర్తు చేస్తోంది. ఈ సినిమాలో రాహుల్ గాంధీ పాత్రలో అశ్విణి కుమార్ నటిస్తున్నారు. ఇక నరేంద్ర మోదీగా హిమంత కపాడియా, మన్మోహన్ సింగ్గా రాజు కేర్ నటిస్తున్న ఈ సినిమాకు రూపేశ్ పాల్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో ‘మై మదర్స్ లాప్టాప్ (2008), సెయింట్ డ్రాక్యులా 3డీ (2012), కామసూత్ర 3డీ చిత్రాలను తీశారు. అయితే కామసూత్ర ఇంకా విడుదల కావాల్సి ఉంది.
‘నమో 4డీ’ చిత్రం
నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై తానొక సినిమా తీయబోతున్నానని, దానికి ‘నమో 4డీ’ టైటిల్ను ఖరారు కూడా చేసినట్లు ‘మై నేమ్ ఈజ్ రాగా’ చిత్రానికి దర్శకత్వం వహించిన రూపేశ్ పాల్ ‘రీడిఫ్ డాట్ కామ్’కు 2014, జనవరి నెలలో ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఎప్పటికో మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు గతంలో ‘మేరీకామ్, భూమి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. ఇక ఆ సినిమాలో మోదీగా వేర్వేరు దశల్లో ముగ్గురు నటిస్తున్నా వివేక్ ఆనంద్ ఒబరాయ్ ప్రముఖంగా కనిపిస్తారు.
ఆ రోజు మరోచిత్రం ఉచితం
ఏప్రిల్ ఐదవ తేదీన ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రాన్ని మార్నింగ్, మ్యాట్నీ షోల్లో చూసిన ప్రేక్షకులు ఆ రోజు రాత్రికి టీవీ నెట్వర్క్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాను ఉచితంగా చూడవచ్చు. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. ఎన్నికలు సమీపస్తున్న నేపథ్యంలో రాజకీయ బయోపిక్లు ఊపందుకున్న విశయం తెల్సిందే. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై మమ్మూట్టి నటించిన బయోపిక్ ‘యాత్ర’, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుపై బాలకష్ణ తీసిన ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేగా నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ‘థాకరే’ సినిమా విడుదలయ్యాయి.
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమా, కాదా ?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇటు రామ్గోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ అసలు కథ’ మార్చి 29న తెలుగు రాష్ట్రాల్లో, అటూ ‘పీఎం నరేంద్ర మోదీ, మై నేమ్ ఈజ్ రాగా’ విడుదలవుతున్నాయి. ఈ సినిమాలకు ఎన్నికల కోyŠ వర్తించదా? అన్న చర్చ ఇప్పుడు ప్రారంభమైయింది. ఎన్నికల కోడ్తో తమకు సంబంధం లేదన్న కారణంతో ఈ సినిమాల విడుదలకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్లు జారీ చేశాయి. వీటిని అడ్డుకోవాలా, వద్దా ? అన్న విశయంలో ఎన్నికల కమిషన్ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.
కానీ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 126 (1) సెక్షన్ కింద కచ్చితంగా ఆంక్షలు వర్తిస్తాయి. ఇందులోని నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదు. నాటకాలు, కచేరీలు, ఇతర వినోద కార్యక్రమాల పేరిట కూడా పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేయరాదు. సినిమాలు, టీవీలు, రేడియోలు, సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ప్రచారం చేయరాదు. మోదీ, రాహుల్పై తీసిన బయోపిక్ చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడమే కాకుండా, టెలివిజన్, ఆన్లైన్, సోషల్ మీడియాల ద్వారా విస్తతంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అలాంటప్పుడు 48 గంటల ఆంక్షలు ఈ సినిమాలకు తప్పకుండా వర్తిస్తాయి. మరి ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.