ఉత్తర, దక్షిణాల మధ్య ఇంత తేడా?!

22 Apr, 2019 16:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా ఉత్తర భారత దేశానికి, దక్షిణ భారత దేశానికి ఎంతో తేడా ఉంది. దక్షిణ భారత దేశంలోని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కేరళ రాష్ట్రాలకు లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 23వ తేదీన పూర్తవుతుండగా, మరో 26 రోజులకు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలు పూర్తవుతున్నాయి. భారత దేశం సరైన దిశలోనే ప్రయణిస్తుందా ? అంటూ ఎన్నికలకు మందు రెండు సంస్థలు అధ్యయనం జరపగా, ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్యన పరస్పర భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 

‘సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సౌసైటీస్‌ సర్వే, సీ ఓటర్‌ నిర్వహించిన వేర్వేరు సర్వేల్లో దేశం సరైన దిశలోనే నడుస్తోందని ఉత్తరాది ప్రజలు సమాధానం ఇవ్వగా, లేదని దక్షిణాది ప్రజలు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రాచుర్యం గురించి ప్రశ్నించగా ఉత్తరాదిలో ఆయనే బలమైన ఆకర్షణీయమైన నాయకుడని యాభై శాతం మందికి పైగా తెలపగా, దక్షిణాది రాష్ట్రాల్లో సరాసరి 30 శాతానికి మించి ఆయన ప్రాచుర్యాన్ని అంగీకరించడం లేదు. అత్యధికంగా కర్ణాటకలో మోదీని పలుకుబడిగల నాయకుడిగా 38.4 శాతం మంది ఆమోదిస్తుంటే, తెలంగాణలో 37.7 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 23.6 శాతం, కేరళలో 7.7 శాతం, తమిళనాడులో 2.2 శాతం మంది అంగీకరిస్తున్నారు. 

కేరళలోని కోజికోడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, కొట్టాయం, పట్టణంతిట్ట ప్రాంతాల్లో బీజేపీకి అంతో ఇంతో బలం ఉన్నప్పటికీ అక్కడి ప్రాంతం ప్రజలు మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేస్తామని చెబుతున్నారు. అందుకు కారణం ప్రస్తుత ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూడీఎఫ్‌యే సరైన ప్రత్యామ్నాయం ప్రజలు భావించడం, ఇక తమిళనాడులో మోదీకిగానీ బీజేపీకిగానీ ప్రజల మద్దతు చాలా తక్కువ. అక్కడి ప్రస్తుత పాలక పక్ష పార్టీ ఏఐఏడిఎంకే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

రాజకీయంగా దక్షిణాదికి, ఉత్తరాదికి మధ్య ఇంత విభిన్నమైన వ్యత్యాసం ఉండడానికి కారణం ఉత్తరాది ప్రజలు పాలనాపరమైన సామర్థ్యాన్నిగానీ, దేశంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోకుండా భావోద్రేకాలతో నిర్ణయం తీసుకుంటారని, అదే దక్షిణాది ప్రజలు ప్రాక్టికల్‌ ఆలోచిస్తారని, అంటే పరిస్థితులకు అనుగుణంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకు బాగుంటుందన్న కోణంలో ఆలోచించడమే కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకనే ఈసారి ఇరువైపుల ఫలితాలు కూడా వైవిధ్యంగా ఉంటాయని వారు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు