తొలి ఉద్యమ సైరన్‌

21 Mar, 2019 12:00 IST|Sakshi

లెజెండ్స్‌ మల్లికార్జున్‌

విద్యార్థి నాయకుడి నుంచి ఉద్యమ నేతగా..

ఆరుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు

ఇందిర ముఖ్య అనుచరుడిగా ముద్ర

కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లోనూ పాత్ర

ఈరగాని భిక్షం, సాక్షి– సిద్దిపేట : నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలిదశ 1969లో ప్రారంభమైంది. ఈ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి అగ్గిరవ్వలు రాజేసి ఉద్యమ బావుటా ఎగురవేసిన నాయకుల్లో మల్లికార్జున్‌ గౌడ్‌ ముఖ్యులు. ఏ ప్రాంతంలోని ఉద్యోగాలు ఆ ప్రాంతం వారికే ఇవ్వాలనే డిమాండ్‌తో సాగిన ముల్కీ, నాన్‌ ముల్కీ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ఉద్యమ పాఠాలు నేర్చిన ఆయన తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

విద్యార్థి లీడర్‌ నుంచి ఉద్యమ నేతగా..
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మల్లికార్జున్‌ మెదక్‌ జిల్లా నల్లగండ్ల గ్రామంలో గీత కార్మికుల కుటుంబంలో 1941లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా చేరి అక్కడ విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశారు. ముల్కీ, నాన్‌ ముల్కీ ఉద్యమంలో ముందుండి నడిచారు. ఈ ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఉన్నా.. వేరే ప్రాంతం వారికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. అప్పటి ఉద్యమ నాయకుడు, ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన మదన్‌మోహన్, మర్రి చెన్నారెడ్డితో కలిసి ఉద్యమంలో పనిచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా సమితిలో కీలక నాయకుడిగా ఉన్నారు. 1971లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌ నుంచి టీపీఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సింహారెడ్డిపై 53,431 ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేసి ప్రత్యేక తెలంగాణ వాదాన్ని చాటారు.

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1980లో ఇందిరాగాంధీని పిలిపించి తన సిట్టింగ్‌ స్థానం మెదక్‌ నుంచి పోటీ చేయించి అత్యధిక మెజార్టీతో ఆమె గెలిచేందుకు కృషి చేశారు. అదే సమయంలో ఆయన మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేశారు. ఇందిరా కాంగ్రెస్‌ నుండి పోటీ చేసిన మల్లికార్జున్‌ కాంగ్రెస్‌ (యూ) నుంచి పోటీ చేసిన రామేశ్వర్‌రావుపై 1,52,661 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనంతరం 1989, 1991, 1996 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా గెలిచారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ, పీవీ నర్సింహారావు మంత్రి వర్గాలలో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి, సమాచారశాఖ మంత్రిగా పని చేశారు. 1996 నుంచి 1998 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2002 డిసెంబర్‌ 24న  మరణించారు.

జాతీయ నాయకుడిగా..విద్యార్థి నాయకుడి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన మల్లికార్జున్‌ది రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర. టీపీఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన తర్వాత రెండుసార్లు మెదక్‌ నుంచి, నాలుగుసార్లు మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలోని కాంగ్రెస్‌ నాయకులతో ఉన్న అనుబంధం ఆయనను కేంద్ర మంత్రిగా నియమించింది. ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ, పీవీ నర్సింహారావు వంటి మహామహులతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఆయన చివరి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించారు.

2009
ఎస్‌.జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌).. సమీప ప్రత్యర్థి
ఎ.పి.జితేందర్‌రెడ్డి (టీడీపీ)పై 18,532 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

చేవెళ్లచాంపియన్లు
2014 కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌).. పి.కార్తీక్‌రెడ్డి (కాంగ్రెస్‌)పై 73,023 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

చేవెళ్ల లోక్‌సభ ఓటర్లు
పురుషులు    12,51,210
మహిళలు    11,64,093
ఇతరులు    295
మొత్తం    24,15,598

మరిన్ని వార్తలు