మోదీపై ఫిర్యాదు.. రాహుల్‌కు ఊరట

18 Dec, 2017 09:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ఆయనకు ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటీసులను వెనక్కు తీసుకుంది. ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్‌ ప్రకారం ఏం చేయాలో ఏం చేయకూడదో అనే విషయాలను డిజిటల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాకు విస్తరించే అంశాలను పునః పరిశీలించాలని అనుకుంటుందని ఆ నేపథ్యంలోనే రాహుల్‌కు పంపిన నోటీసులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఓ టీవీ చానెల్‌కు రాహుల్‌ గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంతో బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా రాహుల్‌కు నోటీసులు పంపింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌ను తీవ్రంగా విమర్శించింది.

ఈసీ కాస్త బీజేపీ పెంపుడు జంతువుగా మారిందని, కేంద్రం ఏం చెబితే అదే చేస్తుందంటూ మండిపడింది. అదే సమయంలో మోదీ ఓటు వేసిన తర్వాత 100 మీటర్లు నడిచి ప్రచారం నిర్వహించారని, అమిత్‌ షా కూడా అలాంటి తప్పిదాలే చేశారని వారిపై మాత్రం ఎందుకు తీసుకోరని ఎదురుదాడి చేసింది. విధుల విషయంలో మొద్దు నిద్రపోతూ బీజేపీ ప్రభుత్వానికి మాత్రం ఓ పప్పెట్‌ మాదిరిగా పనిచేస్తోందంటూ విమర్శించింది. వాస్తవానికి ఎన్నికల కోడ్‌ ప్రకారం ఓటింగ్‌కు 48గంటల ముందు ఏ పార్టీ కూడా ప్రచారం నిర్వహించడంగానీ, ఎన్నికల గురించి మాట్లాడటంగానీ చేయరాదు. అదే సమయంలో మీడియా కూడా ఆ ఎన్నికలకు సంబంధించి లైవ్‌ ప్రచారం చేయకూడదు. కానీ, ఈ రెండు విషయాలు బీజేపీ, కాంగ్రెస్‌ విషయంలో జరగడంతో ఎన్నికల కోడ్‌లోని అంశాలు మరోసారి పునఃపరిశీలిస్తామంటూ ఇరు వర్గాలకు జారీ చేసిన నోటీసులు వెనక్కు తీసుకుంది.
 

మరిన్ని వార్తలు