7 టు 6

20 Apr, 2018 07:40 IST|Sakshi

పోలింగ్‌ సమయం గంట పెంపు

అందరికీ అవకాశం కోసమే

సీఈవో సంజీవ్‌కుమార్‌

యశవంతపుర: పోలింగ్‌ సమయం గంట పెరిగింది. ఇప్పటివరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉండగా, దానిని కాస్త ముందుకు జరిపారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ఒక గంట సమయంను అదనంగా కేటాయించిన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సంజీవ్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన బెంగళూరు విధానసౌధలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. వేసవి ఎండలు అధికంగా ఉన్నందున ఓటర్లకు అనుకూలం కోసం సమయం పెంచామన్నారు. గత ఎన్నికలలో పోలింగ్‌ సమయం సాయంత్రం ఐదు గంటలకు ముగిసేది.

పునీత్, ప్రణీతలతో లఘు చిత్రాలు
ఏప్రిల్‌ 17 నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆరంభం కాగా, మంగళవారం ఒక్కరోజున రాష్ట్రంలో 155 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. ఈసారి పోలింగ్‌ శాతాన్ని పెంచటానికి  ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిన్నట్లు తెలిపారు. సినీ ప్రముఖులు పునీత్‌రాజ్‌కుమార్, నటీ ప్రణీత,  సాహితీవేత్త, జ్ణానపీఠ  గ్రహీత డాక్టర్‌ చంద్రశేఖర్‌ కంబారలతోరూపొందించిన లఘు చిత్రాలను సంజీవ్‌కుమార్‌ విడుదల చేశారు. ఎన్నికల రాయబారిగా కంబారను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కంబార మాట్లాడుతూ ఓటును వినియోగించటం ప్రతి ఒక్కరి హక్కు, కర్తవ్యం, అందుకు సామాన్యులతో పాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని విన్నవించారు.

ఇంటర్నెట్‌లో అభ్యర్థుల సమాచారం
ఎన్నికల విజ్ఞప్తుల పరిష్కారం కోసం స్థాపించిన సువిధా, సమాధాన్‌ విభాగాలు పార్టీలకు, ప్రజలకు ఎంతో ప్రయోజనంగా ఉన్నట్లు రాష్ట్ర డిప్యూటీ ఎన్నికల అధికారి సూర్యసేన అన్నారు. నామినేషన్‌ వేసిన తక్షణమే అభ్యర్థుల వివరాలను ఎన్నికల వెబ్‌సైట్లో ద్వారా పౌరులు తెలుసుకోవచ్చని తెలిపారు. విధాన సభా ఎన్నికల సందర్భంగా ప్రారంబించిన సువిధా  వ్యవస్థ ద్వారా 2895 అర్జీలను స్వీకరించి వీటిలో 2646  అర్జీలను పరిష్కరించిన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. అధికంగా చిక్కబళ్లాపుర జిల్లా నుంచి 187 అర్జీలను స్వీకరించారు.

మరిన్ని వార్తలు