‘టీఆర్‌ఎస్, బీజేపీవి లాలూచీ రాజకీయాలు’

21 Mar, 2018 02:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో టీఆర్‌ఎస్, బీజేపీలు లాలూచీ పడి రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. మంగళవారం పార్లమెంటు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పరస్పర అవగాహనతో రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్‌ సీపీ, టీడీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతిచ్చి.. దీనిపై జరిగే చర్చలో ఈ అంశాలను లేవనెత్తవచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణకు అమలు కావాల్సిన విభజన చట్టంలోని హామీలపైనా కేంద్రాన్ని నిలదీయవచ్చన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క బాధిత కుటుంబాన్నీ పరామర్శించని కేసీఆర్‌.. ఫ్రంట్‌ అంటూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు కోల్‌కతా వెళ్లినందుకు సిగ్గుపడాలన్నారు.

మరిన్ని వార్తలు