కేసీఆర్‌పై పొన్నాల ఫైర్‌

29 Sep, 2018 18:12 IST|Sakshi
పొన్నాల లక్ష్మయ్య

జనగాం జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా మండిపడ్డారు. జనగామలో విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక పాలన కొనసాగించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా సమక్షంలో ప్రజల ముందు కేసీఆర్‌ చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచి కేసీఆర్‌ తన ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన అప్రజాస్వామికమని, అవినీతిమయ పాలన అని ధ్వజమెత్తారు.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగ్గారెడ్డిని అరెస్ట్‌ చేయించారని, రేవంత్‌ రెడ్డిని కూడా అక్రమంగా ఐటీ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నయీం కేసు, లారీలలో ఉన్న డబ్బు, కాగితాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మియాపూర్‌ భూకుంభకోణం, అయ్యప్ప సొసైటీ కుంభకోణం కేసుల సంగతి ఏమైందని సూటిగా అడిగారు. తెలంగాణ హక్కులను మోదీ దగ్గర తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో భారీగా చేరికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు