అమెరికాలో చిప్పలు కడుక్కునే వాడివి!

17 Aug, 2018 01:47 IST|Sakshi

     కేటీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు: పొన్నం 

     మీ అయ్యకు జన్మనిచ్చింది కాంగ్రెస్సేనని వ్యాఖ్య

కరీంనగర్‌: రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. గురువారం కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. అధికార మదంతో ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమని పేర్కొన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు కేటీఆర్‌ వచ్చాడని, పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకొని అమెరికాలో చదివిన విజ్ఞత ఉంటే చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ‘అసలు నీ అయ్య కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అన్న విషయాన్ని మరిచిపోవద్దు’ అని హెచ్చరించారు., కాంగ్రెస్‌ను విమర్శించే వాళ్లే బిచ్చగాళ్లు, లోఫర్లు అని ప్రభాకర్‌ మండిపడ్డారు. కేటీఆర్‌ చరిత్ర బయటపెడితే గ్రామాల్లో తిరగలేడని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ చేయించిన ఆరు సర్వేల్లో ఆ పార్టీ గ్రాఫ్‌ పడిపోయిందని.. అందుకే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ పర్యటనతో టీఆర్‌ఎస్‌ నేతలకు వణుకు పుట్టిందన్నారు. వాస్తవాలను వక్రీకరించి చెబితే టీఆర్‌ఎస్‌ నేతలను గ్రామాల్లోకి రాకుండా రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలంటున్న మంత్రులు.. ముందుగా మీరు ఆ పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు.  

మరిన్ని వార్తలు