‘గడీల పాలనకు చరమగీతం పాడాలి’

1 Oct, 2018 11:36 IST|Sakshi
పొన్నం ప్రభాకర్‌(పాత చిత్రం)

సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో గడీల పాలనకు చరమగీతం పాడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీని అమ్మనా బొమ్మనా అంటున్న మూర్ఖుడు కేటీఆర్ అని మండిపడ్డారు‌. టీఆర్‌ఎస్‌ పార్టీకి నైతికత లేదని విమర్శించారు. కేంద్ర హోం శాఖ భారత పౌరుడు కాదని చెప్పిన చెన్నమనేని రమేష్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఎలా ఇచ్చిందో చెప్పాలన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌ ఎక్కడ ఉండేవారు.. ఏంపీ కవిత బతుకమ్మ ఎక్కడ ఆడేవారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ఢిల్లీకి వేసినట్టే అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కూడా పొన్నం స్పందించారు.  మరి టీఆర్‌ఎస్‌కు ఓటువేస్తే దొరల గడీలకు వేసినట్టు కాదా అని ప్రశ్నించారు. జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానని కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. ప్రజల పక్షాన మాట్లాడే వారిపై కేసులు పెడితే భయపడేది లేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు