లోకేశ్‌ పర్యటన.. వీధులన్నీ వెలవెల

19 Mar, 2019 19:40 IST|Sakshi

సాక్షి, మంగళగిరి: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మంత్రి నారా లోకేశ్‌కు అడగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తొలుత లోకేశ్‌ పోటీ చేసే నియోజకవర్గంపై రకరకాల వార్తలు వచ్చాయి. చివరిగా ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది. అక్కడి నుంచి బరిలో నిలిస్తే ఆయన విజయం సాధిస్తారనే అంచనాతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మంగళగిరిలో లోకేశ్‌ ప్రచారానికి ఆశించన మేర స్పందన రావడం లేదు. గత మూడు రోజులుగా లోకేశ్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. లోకేశ్‌ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకోనేవారు లేకుండా పోతున్నారు. 

మంగళవారం రోజున మంగళగిరి మండలంలోని నవులూరు, బేతపూడి, నీరుకొండ, కురగల్లు గ్రామాల్లో లోకేశ్‌ పర్యటించాల్సి ఉంది. అయితే నవులూరులో లోకేశ్‌ పర్యటనకు స్పందన కరువైంది. కేవలం లోకేశ్‌ వెంట వచ్చిన కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఆ ప్రచారంలో కనిపించారు. నవులూరు గ్రామా ప్రజలు లోకేశ్‌ పర్యటనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆయన పర్యటనకు స్పందన లేక.. వీధులన్నీ వెలవెలబోయాయి. దీంతో చేసేదేమీ లేక లోకేశ్‌, ఆయన అనుచరగణం అక్కడి నుంచి వెనుదిరిగినట్టుగా సమాచారం. లోకేశ్‌ పర్యటన గురించి ఆయా గ్రామాల్లోని ప్రజలకు టీడీపీ నాయకులు ముందుగానే సమాచారం ఇస్తున్నప్పటికీ ఎవరు దానిని లెక్కచేయడం లేదు. ఈ పరిణామాలతో టీడీపీలో కలవరం మొదలైనట్టుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు