ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్‌ తేవొద్దు: పోసాని

23 Mar, 2019 19:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్టీ రామారావు మరణానికి కారకుడైన చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రశ్నించలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ను పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. చంద్రబాబును పొడుగుతూ వైఎస్‌ జగన్‌ను విమర్శించడంలోని ఆంతర్యం ఏమిటని అడిగారు. ఆంధ్రా వాళ్లపై తెలంగాణలో దాడులు చేస్తున్నారని భీమవరంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై పోసాని స్పందించారు.

‘పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన వాటిలో ఒక్కటి మాత్రం నిజం. ఒక విషయం ఒప్పుకుంటా. తెలంగాణ నడిబొడ్డులో ఒక ఆంధ్రావాడిని చంపేశారు. చంపినవాడు ఎవరో తెలుసా తెలంగాణవాడు కాదు ఆంధ్రావాడు. చచ్చిపోయిన ఆంధ్రావాడు ఎన్టీఆర్‌, చంపిన ఆంధ్రావాడు చంద్రబాబు నాయుడు. తెలుగువాళ్ల ముద్దుబిడ్డ ఎన్టీఆర్‌ మరణానికి కారకుడు చంద్రబాబు. దీన్ని నువ్వు ఖండించివుంటే నిన్ను అభినందించే వాడిని. నీ పాదాలకు దండం పెట్టేవాడిని. దుర్మార్గుడైన చంద్రబాబును ప్రతిసారి ఏదో సానుభూతి చూపించి పొగుడుతున్నావు. జనంలో తిరుతున్న జగన్‌ను మాత్రం ప్రతిసారి వేలుపెట్టి కెలుకుతున్నావు.

మీ రాజకీయాలు మీరు చూసుకోండి తప్పులేదు. రాజకీయంగా జగన్‌ను విమర్శించు, చంద్రబాబును పొగుడు. కానీ ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయాలు చేయొద్దు. ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్‌ తేవొద్దు. మేము ఇక్కడ నలిగిపోతాం. పవన్‌ కళ్యాణ్‌ నీ పాదాల సాక్షిగా చెబుతున్నా ఇలాంటి వక్రమైన మాటలు మళ్లీ మాట్లాడొద్దు. నువ్వు గెలవాలంటే నువ్వు ఏం చేస్తావో చెప్పు. ఏం చేయగలవో చెప్పు. ఏపీలో రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో చెప్పు. 1984 నుంచి నేను హైదరాబాద్‌లో ఉన్నా, తెలంగాణ మొత్తం తిరిగాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ విర్శిస్తూ వ్యాసాలు రాసినా ఆయన ఏమనలేదు. ఏ ఒక్క తెలంగాణ బిడ్డ నన్ను కొట్టలేదు. తెలంగాణలో ఆంధ్రావాళ్లను ఎవరు కొట్టారో పవన్‌ ఆధారాలు చూపించాల’ని పోసాని కృష్ణమురళి డిమాండ్‌ చేశారు. (పవన్‌ కళ్యాణ్‌.. ఇది తప్పు: పోసాని)

మరిన్ని వార్తలు