పోస్టల్‌ బ్యాలెట్ ఇక సాఫ్ట్‌గా

6 Apr, 2019 12:30 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికత వినియోగం వైపు మొగ్గుచూపుతోంది. ఓటర్ల సౌకర్యార్థం ఇప్పటికే పలు యాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. తాజాగా పోస్టల్‌ బ్యాలెట్‌ మంజూరులోనూ మార్పు తీసుకొచ్చారు.  

ప్రత్యేక వెబ్‌సైట్‌
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌–సాఫ్ట్‌ అనే వెబ్‌సైట్‌ను రూపొందించి, దాని ద్వారానే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ధ్రువ పత్రాలను మంజూరు చేయనున్నారు. వెబ్‌సైట్‌లో వివరాల నమోదుకు జిల్లాస్థాయిలో ఒకరిని, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఒక్కొక్కరిని నోడల్‌ అధికారులుగా నియమించారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొ నే సిబ్బంది వివరాలను విభాగాల వారీగా సేకరించి పీబీ సాఫ్ట్‌లో నమోదు చేస్తున్నారు.

విధులు నిర్వహించే చోటే..
ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ఉద్యోగులు విధులు నిర్వహించే పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని మొదటిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అధికారులు జారీ చేసిన ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌ (ఈడీసీ)ను ప్రిసైడింగ్‌ అధికారికి సమర్పించి ఓటు వేయొచ్చు. ఇతర పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉండేవారికి మాత్రం పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేస్తారు.

ధ్రువపత్రాల జారీ ఇలా..
ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధికి చెందిన వారైతే ఫారం 12(ఏ), ఇతర పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధికి చెందిన వారైతే ఫారం–12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వారి వివరాలను నూతనంగా రూపొందించిన పోస్టల్‌ బ్యాలెట్‌ సాఫ్ట్‌లో నమోదు చేస్తారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఇందులో లాగిన్‌ కావొచ్చు. దరఖాస్తు వివరాలను సరిచూసుకొని ఏఆర్వో ఓకే చేస్తే వెంటనే ఆయా ఉద్యోగులకు ఈడీసీ ధ్రువపత్రాలు జారీ కానున్నాయి.

మొదటిసారిగా..
పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని పరిశీలించే సూక్ష్మ పరిశీలకులతోపాటు వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణలో పాల్గొనే విద్యార్థులకు, పోలింగ్‌ సామగ్రిని రవాణా చేసేందుకు వినియోగించే సిబ్బందికి సైతం పోస్టల్‌ బ్యాలెట్‌ సాఫ్ట్‌ ద్వారా ధ్రువపత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలింగ్‌ శాతం  పెరిగే అవకాశం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ లో పాల్గొన్న ప్రైవేట్‌ సిబ్బందితోపాటు వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించిన విద్యార్థులు ఓటు హ క్కును వినియోగించుకోలేకపోయారు. ప్ర స్తుతం నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం లభించనుంది.  

మరిన్ని వార్తలు