శివుడిగా తేజ్‌.. పార్వతిగా ఐశ్వర్య..!

12 May, 2018 15:57 IST|Sakshi

పట్నా:  ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆర్‌జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్‌ కూతురు ఐశ్వర్య రాయ్‌ను తేజ్‌ శనివారం పెళ్లి చేసుకోబోతున్నారు. దాణా కుంభకోణం కేసుల్లో జైలులో ఉన్న లాలూ.. కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికు వచ్చారు.

ఈ పెళ్లి కోసం లాలూ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేసింది. అటు ఆర్జేడీ అభిమానులు, కార్యకర్తల కోలాహలం కూడా పెద్దస్థాయిలో ఉంది. పెళ్లి చేసుకోబోతున్న తేజ్‌ ప్రతాప్‌ కటౌట్లు, పోస్టర్లు పెద్ద ఎత్తున ఆర్జేడీ కార్యకర్తలు నిలబెట్టారు. ఇందులో లాలూ నివాసం వద్ద ఏర్పాటుచేసిన ఓ కటౌట్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి కొడుకు తేజ్‌ప్రతాప్‌ను శివుడిగా, పెళ్లికూతురు ఐశ్వర్యను పార్వతిగా చిత్రీకరించిన ఈ కటౌట్‌ను కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పట్నాలోని వెటినరీ కాలేజీ కాంపౌండ్‌లో జరుగబోతున్న ఈ పెళ్లికి అతిరథ మహారథులు వేంచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలకు, ప్రముఖులకు, మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌​, సమాజ్‌వాద్‌ పార్టీ సుప్రీం ములాయం సింగ్‌ యాదవ్‌లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20వేల మంది వరకు ఈ పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారని బిహార్‌ ఆర్‌జేడీ అధ్యక్షుడు రామ్‌ చంద్ర పూర్వే చెప్పారు.

మరిన్ని వార్తలు