‘ఎవరి ఒత్తిడి లేదు, అందుకే వైఎస్సార్‌సీపీలో చేరా’

13 Mar, 2019 10:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విజయవాడ అభివృద్ధే తన ఎజెండా అని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌ అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత విజయవాడ వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. తాను పుట్టిపెరిగిన విజయవాడను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీలో చేరినట్టు చెప్పారు. తనకు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తానని అన్నారు. రాజధాని అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై వైఎస్‌ జగన్‌కు స్పష్టమైన విజన్‌ ఉందని తెలిపారు. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలంతా చూశారని చెప్పారు.


పాదయాత్ర స్ఫూర్తితో చేరా: రత్నబిందు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం​ చాలా సంతోషంగా ఉందని విజయవాడ మాజీ మేయర్‌ రత్నబిందు అన్నారు. వైఎస్‌ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంతో తాను మేయర్‌గా పనిచేశానని, ఆయన కుటుంబంలోకి మళ్లీ రావడం​ హ్యాపీగా ఉందని తెలిపారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలను జనంలోకి తీసుకెళ్లడం వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్‌ జగన్‌ చేసిన పాదయాత్ర స్ఫూర్తితో పార్టీలో చేరినట్టు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. (వైఎస్సార్‌సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ)

మరిన్ని వార్తలు