ప్ర‌గ్యా ఠాకూర్ క‌నిపించ‌డం లేదంటూ పోస్ట‌ర్లు

30 May, 2020 09:58 IST|Sakshi

భోపాల్ :  ఓ వైపు క‌రోనాతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే  ప‌రిస్థితిని స‌మీక్షించాల్సిన ఎంపీ మాత్రం ఎక్క‌డా  క‌నిపించ‌డం లేదంటూ న‌గ‌రంలో పోస్ట‌ర్లు వెలిశాయి. భోపాల్ ఎంపీ  ప్రగ్యా ఠాకూర్ క‌నిపించ‌డం లేదు..త‌ప్పిపోయిన ఎంపీ కోసం వెత‌కండి అంటూ వివిధ  ప్రాంతాల్లో పోస్ట‌ర్లు క‌నిపించాయి. ఇప్ప‌టివ‌ర‌కు   భోపాల్‌లో 14,000 మందికి క‌రోనా సోకింది. అయితే బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉండి క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంపీ  ఎక్క‌డా క‌నిపించ‌డం లేదంటూ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌ధ్యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఎంపీ కోసం వెత‌కండి అంటూ పోస్ట‌ర్లు అంటించారు.  ఓట‌ర్లు ఓటు వేసే మందు ఆలోచించాల‌ని , క‌ష్ట స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌లేని ఇలాంటి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఎన్నుకోవ‌ద్దు అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమలేశ్వర్ పటేల్ అన్నారు. (అగ్నిప్రమాదంలో బీజేడీ నేత ఆలేఖ్‌ చౌదరి మృతి )

మ‌రోవైపు ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ మాత్రం ప్ర‌జ‌ల కోసం గ‌డియారంలా ప‌నిచేస్తున్నార‌ని, ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధి మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదని ఆరోపించారు.  ఎంపీ క‌నిపించ‌డం లేదంటూ వెలిసిన పోస్ట‌ర్ల‌పై బిజెపి అధికార ప్రతినిధి రాహుల్ కొఠారి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం  ఎయిమ్స్‌లో ప్ర‌గ్యా ఠాకూర్  కంటి, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారని అయిన‌ప్ప‌టికీ  కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్ర‌జ‌ల‌కు స‌రుకులు , ఆహారం లాంటివి పంపిణీ చేస్తున్నార‌ని దిగ్విజ‌య్ సింగ్ కేవ‌లం ఫోటోల‌కు ఫోజులిస్తూ క‌రోనాని కూడా రాజ‌కీయం కోసం వాడుకంటున్నార‌ని విమ‌ర్శించారు. ఈనెల ప్రారంభంలో ఉప ఎన్నికలకు ముందు  మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆయ‌న  కుమారుడు నకుల్ నాథ్  తప్పిపోయార‌ని వీరి ఆచూకీ క‌నిపెట్టిన వారికి 21,000 రూపాయ‌ల రివార్డు కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తూ కొంద‌రు పోస్ట‌ర్లు అంటించారు. అంతేకాకుండా జ్యోతిరాదిత్య సింధియా, మాజీ మంత్రులు ఇమార్తి దేవి, లఖన్ సింగ్ క‌నిపించ‌డం లేదంటూ పోస్ట‌ర్లు పెట్టిన ఇద్ద‌రు స్థానిక నాయ‌కుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. (బ్లడ్‌ శాంపిళ్లను ఎత్తుకెళ్లిన కోతులు )


 

మరిన్ని వార్తలు