ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎదుట వాపోయిన జనం
జన్మభూమి కమిటీల ఆగడాలు మీరిపోయాయని ఆవేదన
కొల్లేరును ఆక్రమించేస్తున్నారని ఫిర్యాదు
చదువుకునే పరిస్థితి లేదని వివరించిన విద్యార్థులు
జీతాలు సక్రమంగా రావడం లేదని గోడువెళ్లబోసుకున్న దేవదాయ శాఖ ఉద్యోగులు
అందరి సమస్యలు ఓపికగా విన్న జననేత
మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి :
‘నాలుగేళ్లుగా చిన్న చిన్న పనులు కూడా కావడం లేదన్నా.. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రేషన్ కార్డులు ఇవ్వడం లేదు.. ఉన్న పింఛన్లూ తొలగిస్తున్నారు.. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు.. ఏ సమస్య చెప్పినా పట్టించుకునే నాథుడు లేడు’ అంటూ వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో 158వ రోజు గురువారం ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది.
రేషన్కార్డు మొదలు.. ఆఖరుకు కులధ్రువీకరణ పత్రాల మంజూరులోనూ జన్మభూమి కమిటీ సభ్యులే కీలకపాత్ర వహిస్తున్నారని పెరికగూడెంలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు టీడీపీ నాయకులు కొల్లేరును కొల్లగొడుతున్నారని, అనుమతులు లేకుండా చేపలు, రొయ్యలను సాగు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. చేపల చెరువుల వద్దకు చేరుకోడానికి దారులు లేవని వాపోయారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని రాత్రికి రాత్రి రోడ్లు, బాటలు వేసుకుంటున్నారని వివరించారు.
జీతాలివ్వకపోతే ఎలా బతకాలన్నా..
బ్రిటీష్ కాలంలో నిర్మించిన అండర్ టన్నెల్ ధ్వంసం కావడంతో పెదలంక డ్రెయిన్ నీరు చేరి పొలాలు చౌడుబారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దిగుబడి కూడా తగ్గిపోయి సాగు గిట్టుబాటు కావడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ‘మా నియోజకవర్గం కాలువ చివర ఉండటంతో ఖరీఫ్లోనూ పొలాలకు నీరు అందడం లేదు. మురుగు కాల్వల్లో ఇంజన్లు పెట్టి నీటిని తోడుకుంటున్నాం.
పులిచింతల కట్టేశాం.. ఇక నీటికి ఇబ్బంది ఉండదని చెప్పిన టీడీపీ నాయకులు ఇప్పుడు కనపడటం లేదు’ అని కొర్లపాడు గ్రామానికి చెందిన రవికుమార్ జగన్కు వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశించినా తమకు జీతాలు ఇవ్వడం లేదని దేవదాయ, ధర్మదాయ ఉద్యోగులు జననేత ఎదుట గోడువెళ్లబోసుకున్నారు. ట్రెజరీ ద్వారా తమకు జీతాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని.. పాలనా సిబ్బంది, అర్చకులు, వాచ్మన్లకు ఒకే పద్దు కింద జీతాలు ఇప్పించాలని ఆ సంస్థ ఉద్యోగుల సంఘం నాయకులు పగడాల కోటేశ్వరరావు కోరారు.
అధ్వానంగా ట్రిపుల్ఐటీలు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ట్రిపుల్ఐటీల్లోని విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ విడుదల కావడం లేదని అక్కడ చదువుతున్న మండవల్లి గ్రామానికి చెందిన వాసే తనూజ్ వివరించారు. సిబ్బంది కొరతతో పాటు ఇతరత్రా మౌలిక వసతులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
కరెంట్ షాక్ తగిలి తన భర్త ఐదేళ్ల క్రితం చనిపోయినా ఇంతవరకు మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని కొర్లపాడు గ్రామానికి చెందిన బొత్స వసంత గోడు వెళ్లబోసుకుంది. గ్రామాల్లోని చర్చిలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయని కొర్లపాడు క్రాస్రోడ్డుకు చెందిన పాస్టర్ కోటిపల్లి మోషే వివరించారు. గ్రామాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని పలువురు చెప్పుకున్నారు.