సాక్షి, కర్నూలు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, అందరినీ కలుపుకుపోతూ జననేత పాదయాత్ర సాగిస్తున్నారు. 8వ రోజు పాదయాత్రలో భాగంగా ఆయన మంగళవారం 16 కిలోమీటర్లు నడిచారు. కర్నూలు–వైఎస్సార్ జిల్లా సరిహద్దులోని ఎస్ఎస్ దాబా నుంచి ఆయన ఈరోజు ఉదయం యాత్రను మొదలుపెట్టారు. చాగలమర్రి, గొడిగనూరు, ముత్యాలపాడు, చక్రవర్తులపల్లి మీదుగా ఆర్. కృష్ణాపురం వరకు యాత్ర సాగించారు. ఈ రోజు ఆయన ఇక్కడే బస చేయనున్నారు.
వంద కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా వైఎస్ జగన్... గొడిగనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. చాగలమర్రిలో ఓ వృద్ధురాలు తనకు పెన్షన్ రావడం లేదని జగన్కు మొరపెట్టుకుంది. అగ్నిప్రమాదంలో తన రెండు చేతులు కాలిపోవడంతో వేలి ముద్ర వేయలేకపోతున్నానని గోడు వెళ్లబోసుకుంది. వృద్ధురాలి ఆవేదనతో జగన్ కదిలిపోయారు. ఆమె సమస్యను పరిష్కరించాలని స్థానిక నేతలను ఆదేశించారు.