‘లాక్‌డౌన్‌పై కాంగ్రెస్‌ అప్పుడలా.. ఇప్పుడిలా’

26 May, 2020 16:54 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ తీరుపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విఫలమైందన్న రాహుల్‌ గాంధీ ఆరోపణల్ని తిప్పికొట్టారు. యావత్‌ దేశం ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతుంటే కాంగ్రెస్‌ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సరైన సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారని ప్రపంచ దేశాలు మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించాయని గుర్తు చేశారు. కరోనా తొలినాళ్లలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో మూడు రోజులుగా ఉన్న కేసుల డబ్లింగ్‌ రేటు.. 13 రోజులకు పెరిగిందని వెల్లడించారు. ఇది భారత్‌ విజయమని అన్నారు. 
(చదవండి: లాక్‌డౌన్‌ విఫలం: ప్లాన్‌ బి ఏంటి..!)

‘తొలుత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను వ్యతిరేకించిన కాంగ్రెస్‌.. ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని వ్యాఖ్యానించింది. ఇప్పుడేమో లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తే.. ఆ నిర్ణయం సరైంది కాదని చెప్తోంది. ఇక్కడే తెలుస్తోంది. కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి’ అని జవదేకర్‌ విమర్శించారు. ‘అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీ, ఇరాన్‌, బ్రెజిల్‌, చైనాతో పోలిస్తే భారత్‌లో కోవిడ్‌ ప్రభావం తక్కువగా ఉంది. సరైన సమయంలో లాక్‌డౌన్‌ విధించారని ఆయా దేశాలు కేంద్రం నిర్ణయాన్ని కొనియాడారు’ అని పేర్కొన్నారు. వలస కార్మికుల తరలింపునకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని జవదేకర్‌ తెలిపారు. ఇప్పటికే మూడు వేళ ప్రత్యేక రైళ్లలో మూడు లక్షల మందిని స్వస్థలాలకు చేర్చామని చెప్పారు.
(సోనియాజీ..చిల్లర రాజకీయాలు తగదు..)

మరిన్ని వార్తలు