కాషాయ రేపిస్ట్‌: ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు!

19 Sep, 2019 15:51 IST|Sakshi

న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడిని ఉద్దేశించి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ ఇటీవల ‘కాషాయ దుస్తులు ధరించిన రేపిస్టు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా దిగ్విజయ్‌ను సీరియస్‌గా తీసుకోదని, అలాంటిది ఆయన గురించి తానెందుకు స్పందించాలని జవదేకర్‌ పేర్కొన్నారు. ముంబై పేలుళ్ల తర్వాత చేసిన వ్యాఖ్యలతో ఆయన మనస్తత్వం ఏమిటనేది బయటపడిందని, అప్పటి నుంచి ఆయన ఇదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద తనపై అత్యాచారం చేశారంటూ ఓ వైద్య విద్యార్థిని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దిగ్విజయ్‌ స్పందిస్తూ.. ‘ఈ రోజుల్లో కొంతమంది కాషాయ దుస్తులు ధరించి మరీ అత్యాచారాలు జరుపుతున్నారు. ఆలయాల లోపల కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదేనా మన మతం?  మన సనాతన ధర్మాన్ని అవమానించిన వారిని దేవుడు క్షమించబోడు’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు