జాతీయ పక్షిగా కాకి!

23 Apr, 2018 09:37 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి బీజేపీపై విరుచుపడ్డారు. శనివారం మండ్యాలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే తన ప్రాణాలకు గ్యారెంటీ ఉండబోదన్న ప్రకాశ్‌ రాజ్‌.. కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలంటూ వ్యాఖ్యలు చేశారు.

‘బీజేపీ గనుక అధికారంలోకి వస్తే నన్ను ఏదో ఒకటి చేయటం మాత్రం ఖాయం. ఈ మధ్యే కలబురగిలో బీజేపీ నేతలు నాపై దాడికి యత్నించారు. నా కారుపై రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికారంలోకి వచ్చాక నన్ను వదిలేస్తారా?. ప్రశ్నించటమే నా తప్పు అయితే ఇది ప్రజాస్వామిక దేశం ఎలా అవుతుంది?’ అని ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు. భారత్‌ను హిందూ దేశం అనటాన్ని తాను వ్యతిరేకిస్తానన్న ప్రకాశ్‌ రాజ్‌.. కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

‘ హిందువులు ఎక్కువగా ఉన్నారని వాళ్లు(హిందూ అతివాద సంస్థలు) భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తున్నారు. మరి దేశంలో నెమళ్ల సంఖ్య కన్నా కాకులు కోకోల్లలుగా ఉన్నాయి. అలాంటప్పుడు కాకినే జాతీయ పక్షిగా ప్రకటించటమే ఉత్తమం!. కేవలం ఒక మతం ఆధారంగా దేశానికి ముద్ర వేయటం మూర్ఖత్వమే అవుతుంది’ అని ఆయన అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు