ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారు : పీవీపీ

1 Apr, 2019 15:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ : తన పిలక ఏ ప్రభుత్వం చేతిలో లేదని.. ఇక మీదట ఉండబోదని వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  ఇంజనీరింగ్‌ తర్వాత ఇక్కడ ఏం చేయాలో తనకు తెలియలేదన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుటికి కూడా రాష్ట్రంలో అవే పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ మంత్రి ఇక్కడి వాడే.. కృష్ణా నది పక్కనే ఉన్నా జనాలకు తాగునీరు అందించలేని దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధి గురించి గంటలు గంటలు మాట్లాడటం కాదు.. చేతల్లో చూపాలని పేర్కొన్నారు. ఎకనామిక్‌, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ను డెవలప్‌ చేయాలి.. హెల్త్‌ సర్వీసెస్‌ని అభివద్ధి చేయాలని తెలిపారు. పెద్ద పెద్ద ఈవెంట్స్‌ విజయవాడకు వస్తే అనేక మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఒక కామన్‌ మ్యాన్‌గా విజయవాడలో అనేక ఉపాధి అవకాశాలు కల్పించాను.. ఎంపీగా గెలిపిస్తే తనకున్న కార్పొరేట్‌ సర్కిల్‌ను విజయవాడ అభివృద్ధికి తోడ్పాటుగా తీసుకువస్తానని స్పష్టం చేశారు. తాను చెప్పిన అభివృద్ధికి డబ్బులతో పనిలేదని.. సంకల్పం ఉంటే చాలని తెలిపారు.

తన మీద ఆరోపణలు చేసేవారు ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనపై ఒక్క సీబీఐ చార్జ్‌ షీట్‌ కూడా లేదని కావాలంటే చెక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనను ఇబ్బంది పెట్టే వ్యవహారాలు ఏం లేవని.. తన పిలక ఏ ప్రభుత్వం చేతిలో లేదని.. ఇక మీదట ఉండబోదని స్పష్టం చేశారు. ఇక సినిమాల విషయానికోస్తే... పెద్ద పెద్ద హీరోయిన్లు తనతో పని చేశారని ఎవరతో సమస్య రాలేదని తెలిపారు. ఒక్క శృతిహాసన్‌ మాత్రం షూటింగ్‌ మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని.. పోరాడి మరి ఆమెకిచ్చిన అడ్వాన్స్‌ డబ్బును వెనక్కి తెచ్చుకున్నానని తెలిపారు.

మరిన్ని వార్తలు