లాక్‌డౌన్‌ : కార్మికుల కన్నీటిపర్యంతం

30 Mar, 2020 13:38 IST|Sakshi

బిహార్‌లో వలస కార్మికుల నిర్బంధం

ప్రభుత్వంపై ప్రశాంత్‌ కిషోర్‌ విమర్శలు

పట్నా : దేశ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేసిన మహ్మమారి కరోనా వైరస్‌ చివరికి రాజకీయాలకూ పాకింది. రాష్ట్రంలోని వలస కార్మికులను రక్షించడంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ దారుణంగా విఫలమైయ్యారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ విమర్శలు గుప్పించారు. దీనికి ట్విటర్‌ను వేదికగా చేసుకుని ’ప్రభుత్వ వైఫల్యాన్ని చూపే హృదయ విదారకర ఘటన’ అంటూ నితీష్‌పై ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ను ఎదుర్కొవడంలో నితీష్‌ తీవ్రంగా విఫలమయ్యారని, అంతిమంగా పొట్టకూటి కోసం దేశ నలుమూలల నుంచి బిహార్‌కు వచ్చిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రశాంత్‌ కిషోర్‌ దుమ్మెత్తి పోశారు. అంతేకాకుండా తన వైఫల్యాలను అంగీకరించి ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే దేశమంతా రవాణ సౌకర్యాన్ని ఎక్కడిక్కడికి నిలిపివేశారు. దీంతో ఉపాధి కోసం పలు రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పలు ప్రాంతాల్లో తింటానికి కూడా తిండిలేక కాలేకడుపుతో అలమటిస్తున్నారు. అ క్రమంలోనే వివిధ ప్రాంతాలను నుంచి బిహార్‌కు వలస వచ్చిన కార్మికులపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. (200 కిమీ నడక.. మధ్యలోనే ఆగిన ఊపిరి)

ప్రజలెవ్వరూ రాష్ట్రాల సరిహద్దులు దాటరాదన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్మికులందరినీ క్వారెంటెన్‌ కేంద్రాలకు పంపించారు. కార్మికులకు నివాసం కల్పించిన ఓ వీడియోను ప్రశాంత్‌ కిషోర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ వీడియోలో వాళ్ల ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతవుతున్నారు. ప్రభుత్వం నుంచి తామకు ఏమీ అవసరంలేదని, తమ స్వస్థలాలకు పంపిస్తే చాలని విలపిస్తున్నారు. కనీన సామాజిక దూరం పాటించలన్న నిబంధనలు ఉల్లంఘించి... అందరినీ ఒకే గదిలో బందించినట్లు ఆ వీడియోలో తెలుస్తోంది.

కాగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడంపై ప్రశాంత్‌ కిషోర్‌ ఇదివరకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోలేకపోతున్నారని, కరోనా వైరస్‌ సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో ఎదుర్కోలేపోతోందని అభిప్రాయపడ్డారు. మరోవైపు వైరస్‌ విపత్తు నుంచి ‍ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని ప్రశాంత్‌ స్వాగతించారు.

>
మరిన్ని వార్తలు