రెబెల్‌గా పోటీకి సిద్ధం

14 Nov, 2018 03:30 IST|Sakshi

మామ సర్వేకు కంటోన్మెంట్‌ టికెటివ్వడంపై క్రిశాంక్‌ కినుక

సాక్షి, హైదరాబాద్‌: ‘నా పేరు సర్వే సత్యనారాయణ అల్లుడు కాదు.. క్రిశాంక్‌ మాత్రమే. ఉస్మానియా విద్యార్థి నేతగా కంటోన్మెంట్‌ ప్రజలకు సుపరిచితుడిని. 6 నెలలుగా నియోజకవర్గంలో బస్తీ నిద్రలు చేసి ప్రజలకు చేరువయ్యాను. మా జేబులన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఎవరో వచ్చి టికెట్‌ ఎగరేసుకుపోతే ఎలా.. ఈ రోజు మా మామ.. రేపు ఇంకో పారాచూట్‌ నేత.. ఇంక మాకు ఓపిక లేదు. నేను రెబ ల్‌గా పోటీచేసేందుకే సిద్ధమవుతున్నా’ అని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు మన్నె క్రిశాంక్‌ అన్నారు.

ఓయూ విద్యార్థి నేత అయిన క్రిశాంక్‌కు గత ఎన్నికల్లో త్రుటిలో కంటోన్మెంట్‌ టికెట్‌ చేజా రింది. గత ఎన్నికల సందర్భంగా తన పేరును అభ్యర్థిగా ప్రకటించి చివరి నిమిషంలో మార్పు చేశారు. అయినా ఆయన అప్పటి నుంచి పార్టీలో కొనసాగు తూ, కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో క్రియాశీలకం గా పనిచేస్తున్నారు. తన మామ సర్వేకు కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించడంపై క్రిశాంక్‌ గళం విప్పారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 3 సార్లు ఓడిపోయిన సర్వేకు టికెట్‌ ఎలా ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వే ఎవరో ప్రజలకు తెలియదు..
సర్వే సత్యనారాయణ ఎవరో కంటోన్మెంట్‌ ప్రజలకు తెలియదని, తన పేరు అందరికీ తెలుసని క్రిశాంక్‌ చెప్పారు. ఈసారి కాంగ్రెస్‌ ఒక్క ఓయూ విద్యార్థి నాయకుడికి కూడా టికెట్‌ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ రావాలంటే గాడ్‌ఫాదర్‌ ఉండాలని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు