న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఉత్తరప్రదేశ్ (తూర్పు) పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఫిబ్రవరి 4న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. కుంభమేళాలో గంగానదిలో పుణ్యస్నానమాచరించి పార్టీలో ఆమె పదవీ బాధ్యతలు తీసుకుంటారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రియాంకతో పాటు ఆమె సోదరుడు రాహుల్ గాంధీ కూడా గంగా నదిలో పుణ్యస్నానం చేయనున్నారు. అదే రోజు వీరిద్దరూ కలిసి లక్నోలో విలేకరుల సమావేశంలో పాల్గొనున్నారు. ఒకవేళ ఫిబ్రవరి 4న కాకుంటే 10న వసంత పంచమి రోజు కావడంతో ఆ రోజు ప్రియాంక బాధ్యతలు చేపడతారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2001లో గంగా నదిలో పుణ్యస్నానం చేశారు. ప్రియాంక, రాహుల్ గానీ అప్పట్లో స్నానమాచరించలేదు. కాగా, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలో పాగా వేసేందుకు ప్రియాంక గాంధీ పాటు జ్యోతిరాదిత్య సింధియాకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.