నీరవ్‌ అరెస్ట్‌పై ప్రియాంక గాంధీ కామెంట్‌

21 Mar, 2019 08:45 IST|Sakshi

చందౌలీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ అరెస్ట్‌పై కాంగ్రెస్‌ యూపీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్పందించారు. వేలకోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి పారిపోయిన నీరవ్‌మోదీ అరెస్టుతో ఇపుడేదో ఘనత సాధించినట్టు ఎన్‌డీఏ ప్రభుత్వం గప్పాలు పోతోందని విమర్శించారు. అసలు మోదీని లండన్‌కు పారిపోయేలా చేసింది ఎవరంటూ ఎద్దేవా చేశారు.  ఇదో ఎన్నికల ఎత్తుగడ అన్నట్టుగా  ఆమె కొట్టి పారేశారు. 

గత నెలలో పుల్వామా ఉగ్రదాడులో మరణించిన సైనిక కుటుంబాన్ని ప్రియాంక గాంధీ పరామర్శించారు.  అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా మరోవైపు ఆర్థిక నేరగాళ్లపై చర్యలకు నరేంద్రమోదీ ప్రభుత్వానికి  చిత్తశుద్ధి వుంటే.. 2015లో అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఇచ్చిన మోసగాళ్ల జాబితాను ఎందుకు నిర్లక్ష్యం చేశారన్న విమర్శ రాజకీయవర్గాల్లో నానుతోంది. రూ.13వేల కోట్ల పీఎన్‌బీ స్కాంలో నిందితుడు నీరవ్‌మోదీని నిన్న (మార్చి 20, బుధవారం) స్కాట్‌లాండ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పర్చారు. దీంతో మోదీ బెయిల్‌ పిటీషన్‌ను తిరస్కరించిన కోర్టు మార్చి 29వ తేదీ వరకు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు