నానమ్మతో పోలికపై స్పందించిన ప్రియాంక గాంధీ

20 Apr, 2019 08:45 IST|Sakshi

లక్నో : ప్రజలకు సేవ చేయడంలో తప్ప మిగతా ఏ విషయాల్లోనూ నన్ను నానమ్మతో పోల్చకండి అంటున్నారు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కార్యకర్తలు తనను తన నానమ్మ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చడంపై స్పందిస్తూ.. ఈ విధంగా వ్యాఖ్యనించారు ప్రియాంక. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా నానమ్మతో నన్ను పోల్చడం తగదు. నేను ఏ విషయంలోనూ ఆమెతో పోటీ పడలేను. కానీ ఈ దేశ ప్రజలకు సేవ చేయాలనే కోరిక నానమ్మ మనసులో చాలా బలంగా ఉండేది. అదే లక్షణం నాకు, నా సోదరునికి కూడా అబ్బింది. దాన్ని మాత్రం మా నుంచి ఎవరు వేరు చేయలేరు. అందుకు మీరు అనుమతించినా.. ఇవ్వకపోయినా ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’ అని తెలిపారు.

ఈ క్రమంలో ప్రియాంక బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ ఐదేళ్లలో వారు తమ అభివృద్ధి గురించి ఆలోచించారు తప్ప ప్రజలకు చేసిందేమి లేదని మండిపడ్డారు. బీజేపీ తీరు పట్ల దేశంలో అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ విధానం వల్ల నిజంగా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. కాన్పూర్‌ను స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. కానీ నేటికి ఇక్కడ నిరుద్యోగం, రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు