న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రయాంకా గాంధీ వాద్రా బీజేపీపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. భారత్ బచావో ర్యాలీలో ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. ఉద్యోగాల కల్పనలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రణాళిక లేని జీఎస్టీ వల్ల రైతులు, వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ఉద్యోగాలు అంటున్న బీజేపీ శ్రేణుల నినాదానికి ఆమె వ్యంగ్యంగా స్పందించారు. మోదీ వల్ల కోట్ల ఉద్యోగాలు కోల్పోయామని, అదేవిధంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయని ఆమె ద్వజమెత్తారు.
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాల వల్ల గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా రైతులు, నిరుద్యోగులు, నష్టపోయారని ప్రయాంకా గాంధీ అన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, వాయ్నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. విభజన, అహంకారం, అసమర్థత నుంచి దేశాన్ని రక్షించడమే ర్యాలీ ఉద్దేశ్యమని కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం తెలిపింది. దేశ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని పేర్కొంది.