పేదల్ని ‘చౌకీదార్‌’లు పట్టించుకోట్లేదు

25 Mar, 2019 02:59 IST|Sakshi

ప్రియాంక గాంధీ విమర్శ  

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. కాపలాదారులు(బీజేపీ నేతలు) ప్రస్తుతం ధనికుల కోసమే పనిచేస్తున్నారనీ, పేదలగోడు వారికి పట్టడం లేదని దుయ్యబట్టారు. యూపీలో చక్కెర రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10,000 కోట్లు దాటడంపై ప్రియాంక ఆదివారం స్పందిస్తూ..‘యూపీలో చెరకు రైతులు పగలు,రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో బాధ్యత తీసుకోవడం లేదు.

ప్రస్తుతం ఈ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయి. అంటే చెరకు రైతుల పిల్లల చదువులు, ఆహారం, ఆరోగ్యంతో పాటు మరో పంటసాగుకు అవసరమైన నగదు ఆగిపోయినట్లే’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలంతా తమ ట్విట్టర్‌ ఖాతాల్లో పేరుకు ముందు చౌకీదార్‌(కాపలాదారు) అనే పదాన్ని చేర్చిన నేపథ్యంలో ప్రియాంక ఈ మేరకు స్పందించారు. ప్రియాంకా గాంధీ ఇటీవల యూపీ తూర్పువిభాగం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు