బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

28 Mar, 2019 04:15 IST|Sakshi
లక్నో ఎయిర్‌పోర్టులో ప్రియాంకకు స్వాగతం

అమేథీ (యూపీ): కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీ అబద్ధాలను, చేతల్లేని ఒట్టి మాటలను ప్రజలకు వివరించి, కాషాయ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. ఉత్తరప్రదేశ్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. తన అన్న రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గంలో ‘మన బూత్, మన గౌరవం’ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని, ఆ నియోజకవర్గ బూత్‌ స్థాయి కాంగ్రెస్‌ అధ్యక్షులతో దాదాపు రెండు గంటలపాటు మాట్లాడారు.

ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్‌ కార్యకర్తలే ప్రజలకు వివరించాలనీ, లేకపోతే ఈ ప్రభుత్వ నిజస్వరూపం ప్రజలకు తెలీదని ప్రియాంక పేర్కొన్నారు. అమేథీ అంటే కాంగ్రెస్‌కు సొంత కుటుంబం, ఇల్లు వంటిదనీ, అందుకే రాహుల్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారనీ, కానీ బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ కేవలం కాలక్షేపానికే అమేథీకి వస్తున్నారని ప్రియాంక అన్నారు.  కాంగ్రెస్‌ బలోపేతం కోసం పనిచేయడమంటే తనకు ఇష్టమనీ, అయితే, పార్టీ కోసం ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమని తెలిపారు.  పర్యటనలో భాగంగా ప్రియాక అయోధ్య వెళ్లనున్నారు. అయోధ్యలో రాముని విగ్రహం నెలకొల్పిన రామ్‌లల్లాను దర్శించుకుంటారా లేదా అనే ఇంకా తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు