పామును చేతిలో పట్టుకున్న ప్రియాంకగాంధీ

2 May, 2019 13:34 IST|Sakshi

రాయ్‌బరేలి: ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధీ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తన తల్లి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలిలో ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంకగాంధీ.. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ.. వారి గురించి అడిగి తెలుసుకుంటూ.. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని, అందరి అభ్యున్నతికి కృషిచేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం ఆమె రాయ్‌బరేలిలో పాములు ఆడించేవారిని కలుసుకొని వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు.. పాములను ఆమెకు చూపించగా.. ఆమె ఒక పామును చేతిలో పట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక, బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీ పరోక్షంగా సహకరిస్తోందన్న ఎస్పీ, బీఎస్పీ విమర్శలను ఆమె తిప్పికొట్టారు. కాంగ్రెస్‌, బీజేపీ భావజాలాలు పూర్తి విరుద్ధమైనవని, బీజేపీతో తామే పోరాడుతున్నామని, రాజకీయాల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా గతంలో బలహీన అభ్యర్థుల్ని యూపీలో బరిలోకి దించామన్న ప్రియాంక మాట మార్చారు. బీజేపీపై గట్టిగా పోరాడేందుకు బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపామని, ఎన్నికల్లో ఆ పార్టీకి ఏ విధమైన లబ్ధి చేకూరకుండా చూస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు