‘పథకం ప్రకారమే టీడీపీ సభ్యుల ఆందోళన’

12 Dec, 2019 10:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ మార్షల్స్‌ తమ పట్ల దురుసుగా ప్రవర్తిచారని శాసనసభలో టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారు. దీనిపై అధికార వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కౌంటర్‌ ఇచ్చారు. నిన్నటి నుంచి సభలో టీడీపీ సభ్యులు సభా నియామాలకు విరుద్దంగా ప్రవరిస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. సభలో టీడీపీ సభ్యుల ధోరణి భిన్నంగా ఉందని.. ఇది సరైన విధానం కాదన్నారు. సభలో టీడీపీ సభ్యులు కేవలం ఆందోళన చేయడానికే వస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. సభా సజావుగా జరుగుతుంటే టీడీపీ ఓర్చుకోలేకపోతోందని ఆయన మండిపడ్డారు.  పథకం ప్రకారమే టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. ముఖ్యమైన బిల్లులు సభలో ఈ రోజు ఆమోదం పొందుతాయని.. టీడీపీ సభ్యులు కావాలని గందరగోళం సృష్టిస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో పబ్లిక్‌ మీటింగ్‌లపై నిషేధం ఉందని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ  మార్షల్స్‌ తమ పరిధిలో ఉన్న నియమాల ప్రకారమే వ్యవహరిస్తున్నారని బుగ్గన స్పష్టం చేశారు. 

అచ్చెన్నాయుడు సభా సాంప్రదాయ గురించి చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించటంగా ఉందని మంత్రి పుష్పశ్రీవాణి సూటిగా విమర్శించారు. గత శాసనసభలో టీడీపీ దారుణంగా ప్రవర్తించిదని ఆమె మండిపడ్డారు. మీడియాను కూడా అసెంబ్లీలోకి అనుమతించకుండా దౌర్జన్యం చేసిన చరిత్ర టీడీపీదని మంత్రి దుయ్యబట్టారు. నేడు సభా సాంప్రదాయల గురించి చెప్పడం విడ్డురమని పుష్పశ్రీవాణి ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు