‘చంద్రబాబు దీక్ష నవ్వులపాలు’

20 Apr, 2018 17:29 IST|Sakshi
ఎన్‌.రఘువీరా రెడ్డి, చంద్రబాబు నాయుడు (జతచేసిన చిత్రం)

సాక్షి, విజయవాడ: ‘రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాలయాలపై ధర్మపోరాట దీక్ష’ అంటూ చంద్రబాబు చేస్తున్న ఒక్కరోజు నిరాహార దీక్ష చూసి జనం నవ్వుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరా రెడ్డి విమర్శించారు. ఇది ప్రజల్ని వంచించడానికి చేస్తున్న ‘నయా’వంచక దీక్ష అని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై ధ్వజమెత్తారు. 

దీక్షకు మద్ధతు తెలపాలని తనకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షడు కళా వెంకట్రావు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ విజ్ఞప్తి చేశారనీ వెల్లడించారు. అందర్నీ మాయచేసేందుకే చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారని రఘువీర వ్యాఖ్యానించారు. ‘టీడీపీ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ దీక్ష’ అని ఆరోపించారు. ‘ధర్మపోరాట దీక్ష’కు మద్ధతుగా అశోక్‌బాబు కూడా దీక్ష చేపట్టాల్సిందిగా చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.

గతంలో ప్రత్యేక హోదా అంశంపై అశోక్‌బాబు ఉద్యమం చేస్తే.. ఆ క్రెడిటంతా చివరికి చంద్రబాబు కొట్టేశారనీ, మరోసారి చంద్రబాబు మోసానికి బలికావద్దని ఆయన  సూచించారు. ఇప్పటికైనా టీడీపీ నీచ రాజకీయాల్ని గ్రహించి.. ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు చంద్రబాబు ఆడుతున్న మరో​ నాటకం చూసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు