ప్రధాని మోదీ ఫోన్‌ ‘మేడిన్‌ చైనా’ ది..

7 Jun, 2018 09:37 IST|Sakshi

మండ్సోర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'మేకిన్‌ ఇండియా'ను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ దేశంలో మోదీ మాత్రం ఉద్యోగాలు సృష్టించడం లేదని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బీజేపీకి చెందిన టాప్‌ బాస్‌, సంపన్న వ్యాపారవేత్తలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారని విమర్శించారు. ‘ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎక్కడికి పోయాయి? రైతులకు ఇచ్చిన ఆర్థిక భద్రత హామీ ఎక్కడ? మేకిన్‌ ఇండియా పరిస్థితి ఏమిటి? ఒకవేళ మీరు ప్రధాని మోదీ ఫోన్‌ చూస్తే, అది మేడిన్‌ చైనాదిగా గుర్తించవచ్చు’ అని రాహుల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారంలోకి వస్తే, మండ్సోర్‌లోనే ఆ ఫోన్లను తయారీ చేయిస్తామని చెప్పారు. శివ్‌రాజ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను నిరోధించడం లేదన్నారు.

ఇక్కడ రైతుల సమావేశంలో మాట్లాడిన రాహుల్‌, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చే ఒకే ఒక్క పార్టీ తమదేనని, వ్యవసాయ రంగానికి భద్రతనూ కల్పిస్తామని పేర్కొన్నారు. చైనాతో నెలకొన్న డోక్లామ్‌ వివాదంపై ప్రధాని ఎందుకు ఏం మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కోట్ల కొద్దీ రూపాయలు బ్యాంకు ఎగ్గొట్టిన నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సి, విజయ్‌మాల్యాలకు దేశం విడిచి పారిపోవడానికి అవకాశం కల్పించారని, వారి వల్ల రైతులు ఎంతగా బాధ పడాల్సి వస్తుందో తెలుసుకోలేకపోతున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాహుల్‌ గాంధీ పలు వాగ్దానాలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపిస్తే, 10 రోజుల్లో రైతు రుణాలను మాఫీ చేస్తామని గ్యారెంటీ ఇచ్చారు. ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ కంటే, తమ పార్టీ ప్రజల మన్‌ కీ బాత్‌నే ఎక్కువగా విశ్వసిస్తుందన్నారు.  

మరిన్ని వార్తలు