ఖర్గేకు తెలియకుండా వేరే పీఏసీ ఉందా : రాహుల్‌

14 Dec, 2018 19:24 IST|Sakshi

రాఫెల్‌పై వెనక్కి తగ్గేదిలేదన్న కాంగ్రెస్‌ చీఫ్‌

సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో నరేంద్ర మోదీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పందించారు. రాఫెల్‌ ఒప్పందంలో మోదీ సర్కార్‌ అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు. భారత ప్రజలకు చౌకీదార్‌ (కాపలాదారు)గా ఉంటానన్న నరేంద్ర మోదీ పెద్ద దొంగ అని రాహుల్‌ మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. రాఫెల్‌ డీల్‌పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని డిమాండ్‌ చేశారు.

అసలు అప్పుడే పురుడుపోసుకున్న అనిల్‌ అంబానీ కంపెనీకి రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు కాంట్రాక్టు ఎలా ఇస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ‘ఈ డీల్‌కు సంబంధించిన నివేదిక కాగ్‌ ద్వారా పబ్లిక్‌ కమిషన్‌ (పీఏసీ)కు చేరాయని సుప్రీం కోర్టు తెలిపింది. కానీ, పీఏసీ చైర్మన్‌ మల్లిఖార్జున ఖర్గే మాత్రం తమకు ఏ వివరాలు రాలేదని అంటారు. పీఏసీ చైర్మన్‌కు తెలియని నివేదిక ఉంటుందా. ఖర్గేకు తెలియకుండా వేరే పీఏసీ ఉందా’ అని రాహుల్‌ ప్రశ్నించారు. తన స్నేహితుడు అనిల్‌ అంబానీకి ప్రధానమంత్రి అడ్డగోలుగా దోచిపెట్టాడని విమర్శించారు.

రాఫెల్‌ కేసులో మోదీ సర్కార్‌కు ఊరట

>
మరిన్ని వార్తలు